చంద్రబాబు చరిత్ర తెలుసుకోవాలి : సింగిరెడ్డి
తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డీ నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి అంటూ హితవు చెప్పారు.
‘‘జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’
అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారని, 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధిగా పేరు పొందామని ఆయన చరిత్రను వివరించారు.
ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని తెలిపారు. అప్పట్లోనే విష్ణు కుండినుల నుండి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల దాక గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్దికి బాటలు వేశారన్నారు. 15వ శతాబ్దం నుండి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ది చెందిందని చెప్పారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించిన సంగతిని కూడా సింగిరెడ్డి గుర్తుచేశారు.
అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలే పునాదిగా తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. 1956లో ఆంధ్రలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం పడిందన్నారు. చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని, అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారు .. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు నిర్ణీత లక్ష్యానికి సాగునీరు అందించిన దాఖలాలు లేవన్నారు.
ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారు. గ్రామాల్లో ఉపాధి కరువై బొంబాయి, దుబాయి బాట పట్టేలా చేశారు. ఆఖరుకు రూ.2కు కిలోబియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారని నిందించారు.
తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రూ.2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటయింది అని చంద్రబాబు చెప్పడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. మూర్ఖపు అహంకారానికీ పరాకాష్ట అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.