ఈ ముఖ్యమంత్రికే దమ్ము లేదు :నాదెండ్ల
- నిజంగా దమ్ముంటే 26 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వస్తారా?
- జనసేన వ్యూహం ఏంటో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు
- మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి
- ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది
- మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం
- తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
ముఖ్యమంత్రి మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. నిజంగా దమ్ముంటే 26 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వస్తారా? అని ప్రశ్నించారు. ఆయన సింగిల్ గా వస్తే మన వ్యూహం మనకి ఉంటుందని, అది పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెల్లడిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, జన సైనికులంతా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడాలని కోరారు. ఆ నినాదాన్నే ముందుకు తీసుకువెళ్లాలని పిలుపు నిచ్చారు. మార్చి 14వ తేదీన మచిలీపట్నం వేదికగా నిర్వహించనున్న పార్టీ 10వ ఆవిర్భావ సభ ద్వారా మన బలం ఏంటో చాటాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో పార్టీ ఇంచార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేరు వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కలు అందచేశారు. మార్చి 14వ తేదీన నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీకి హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. కార్యకర్తలకు కష్టం వస్తే కుటుంబ సభ్యులకు ఆపద వస్తే అండగా నిలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఒక్క రోజు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన రూ. 30 లక్షలు చెక్కుల రూపంలో అందించబోతున్నాం. చిన్న వయసులో ప్రమాదవశాత్తు భర్త మరణించినప్పుడు ఆ కుటుంబాల వేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోగలం. అందుకే ప్రభుత్వం మాదిరి తూతూ మంత్రం చర్యగా కాకుండా పార్టీ సభ్యులకు అండగా నిలిచేందుకు, వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు మూడేళ్ల క్రితమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు.
- గంజాయి వ్యాపారాలతో యువతను పాడు చేస్తుంది వైసీపీనే
స్వార్థం లేని రాజకీయాలు.. విలువలతో కూడిన వ్యవస్థ.. సమాజం కోసం ప్రశ్నించే తత్వాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరిలో నింపారు. అందుకు నిదర్శనం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్. పార్టీ తరఫున బలంగా ఆయన గొంతు వినిపిస్తారు. అయితే ఈ ప్రభుత్వం ప్రశ్నించే మనస్తత్వం, ప్రజల్లో నిలబడి మాట్లాడే వారి గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు. ఎవరైనా సమస్యల మీద మాట్లాడితే వారిని ఇబ్బందిపెడుతున్నారు. రెండు రోజుల క్రితం ఒంగోలులో శ్రీ సుబ్బారావు గుప్తా బైక్ లో కేజీ గంజాయి దొరికిందని అక్రమ కేసు పెట్టారు. స్థానిక సమస్యల మీద ప్రశ్నిస్తున్నారనే వేదిస్తున్నారు. గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తి అరాచకాలు ప్రశ్నించినందుకు ఆయన్ని గదిలో బంధించి కొట్టారు. ఇప్పుడు గంజాయి పేరుతో అరెస్టు చేశారు. అసలు ఒంగోలుకు గంజాయి ఎలా వచ్చింది. వైసీపీ నాయకులే వ్యాపారాలు చేస్తూ యువతను పాడు చేస్తున్నారు.
- వైసీపీ ప్రభుత్వం మీద తొలి పోరు జనసేనదే
ఇలాంటి ప్రభుత్వం మీద పోరాటానికి అంతా సమష్టిగా నిలబడాలి. పోరాటాల్లో అందరికంటే ముందు నడిచేది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఇప్పటం సభలో ప్రతిపక్ష ఓటు చీలనివ్వం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇచ్చిన తర్వాతే మిగిలిన పార్టీలు బయటకు వచ్చాయి. అప్పటి వరకు ప్రభుత్వానికి ఎదురు నిలిచింది జన సైనికులే. కరోనా సమయంలో కూడా ప్రాణాలు పణంగా పెట్టి మరీ జనసైనికులు ప్రజలకు అండగా నిలిచారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎవరికి ఇబ్బంది వచ్చినా అండగా నిలబడ్డాం. ఇసుక కొరత వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరిట భవన నిర్మాణ కార్మికుల కోసం అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. యువతకు అండగా నిలిచాం. ప్రజల్లో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మనం ఈ ఒక్క సంవత్సరం అహర్నిశలు కష్టపడాల్సిన సమయం. క్రియాశీలక సభ్యత్వం గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు నమోదు చేశాం. కార్యక్రమం ఈ రోజుతో పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పులివెందులతో సహా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాం. ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలి. ప్రతి క్రియాశీలక సభ్యుడు పార్టీ కోసం కొంత సమయం వెచ్చించి పది మందినీ ప్రభావితం చేయాలి. జనసేన పార్టీ కార్యక్రమాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వివరించాలి. పార్టీ గురించి ప్రత్యర్ధులు సృష్టించే పుకార్లు నమ్మవద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశ పూర్వకంగా వ్యక్తగత విమర్శలు చేస్తుంటారు వాటిని పట్టించుకోవద్దు. మనతోపాటు ప్రజలు ఉన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మార్పు వస్తుందన్న నమ్మకంలో ఉన్నారు. క్రమశిక్షణతో ముందుకు వెళ్లి జనసేన జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని అన్నారు.
- ప్రజల గురించి ఆలోచించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు: శ్రీ కొటికలపూడి గోవిందరావు
పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ “నేటి తరం రాజకీయ నాయకులు జేబులు నింపుకోవాలని చూస్తుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కడుపు నింపాలని చూస్తున్నారు. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే క్రియాశీలక సభ్యత్వం. కష్టం వచ్చినప్పుడు మనిషిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలబగలుగుతున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు” అన్నారు.
- రాష్ట్రంలో జన సైనికులే ధైర్యంగా ఉన్నారు: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యత్వం అంటే కార్యకర్తలకు కుటుంబాలకు ఒక భరోసా. అలాంటి ఆలోచన చేసిన ఏకైక పార్టీ జనసేన. కార్యకర్తల్లో ఈ స్థాయి భరోసా నింపిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం పార్టీకి భరోసా ఇస్తే పార్టీ మనకి అండగా నిలుస్తుంది. మార్చి 14వ తేదీన మచిలీపట్నం వేదికగా జరిగే ఆవిర్భావ సభకు ప్రతి ఒక్కరు హాజరై మనం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడతామన్న విషయాన్ని తెలియచేయాలి. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది ప్రభుత్వం కాదు వైసీపీ ఏజెన్సీ. వాళ్లు జేబులు నింపుకునే కార్యక్రమం మినహా ఒక్క రోడ్డు వేయలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు ఒక్క జనసైనికులకు తప్ప. వాళ్ళే ధైర్యంగా ఉన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకోసం నిలబడ్డారు కాబట్టే మనకి దైర్యం, రక్షణ ఉంది” అన్నారు.
- క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల చెక్కులు
అంతకు ముందు ఇటీవల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను శ్రీ మనోహర్ గారు పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలను ఓదార్పి పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కులు వారికి అందచేశారు. తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డుకు చెందిన క్రియాశీలక సభ్యులు శ్రీ దాసరి సాంబమూర్తి భార్య శ్రీమతి వెంకటరమణమ్మ, పోలవరం నియోజక వర్గానికి చెందిన శ్రీ బండారు నరేష్ భార్య శ్రీమతి కాటూరి నందిని, శ్రీ నూతి సత్యనారాయణ భార్య శ్రీమతి పామర్తి అంజలి ప్రసన్న చెక్కులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరితోపాటు ఇటీవల జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందిన క్రియాశీలక సభ్యులకు వైద్యం ఖర్చుల నిమిత్తం రూ. 50 వేల చొప్పున మెడిక్లయిమ్ చెక్కులు అందచేశారు. గోపాలపట్నం నియోజకవర్గానికి చెందిన శ్రీ నరినీడి శ్రీనివాసరావు, నిడదవోలు నియోజకవర్గానికి చెందిన శ్రీ ఆకుల సాయి వెంకట్ లు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా ఈ చెక్కులు అందుకున్నారు.
- జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ విడుదల
కార్యక్రమంలో భాగంగా.. మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ గోడపత్రికను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆవిష్కరించారు. శ్రీ మనోహర్ గారి నుంచి పార్టీ నాయకులంతా గోడపత్రికలు అందుకుని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ రెడ్డి అప్పలనాయుడు, శ్రీ విడివాడ రామచంద్రరావు, శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, శ్రీమతి ప్రియాసౌజన్య, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి మధులత, శ్రీ చెన్నమల్ల చంద్ర శేఖర్, శ్రీ మేకా ఈశ్వరయ్య, శ్రీ చిర్రి బాలరాజు, శ్రీ కరాటం సాయి, శ్రీ మల్నీడి బాబి, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ నాగరాజు, శ్రీ చాగంటి మురళీ కృష్ణ, శ్రీ సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.