తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దగ‌ల‌ శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడినుంచి టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ శ్రీ సెల్ల‌దొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఈవో శ్రీ ముత్తురాజ, ట్రస్టుబోర్డు సభ్యుడు శ్రీ మనోహరన్ కలిసి ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలను తిరుమల శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వీటిని గరుడసేవలో స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు.

భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య స్థానాచార్యులు శ్రీ రంగరాజన్, శ్రీ సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply